బంగాళాఖాతంలో 4 దేశాల మలబార్-20 నౌకాదళ సముద్ర విన్యాసాలు నేడు ప్రారంభమయ్యాయి. భారత్ నిర్వహిస్తున్న ఈ విన్యాసాల్లో అమెరికాతో పాటు జపాన్, ఆస్ట్రేలియాలు పాల్గొంటున్నాయి.అయితే ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా పాల్గొనడంపై చైనా మండిపడుతున్న, ఆ దేశం మాత్రం భయపడకుండా పాల్గొంటుంది.కాగా ఈ విన్యాసాలు తొలిసారిగా 1992లో ప్రారంభించగా, తొలి దశలో భారత్ ,అమెరికాల శిక్షణా కార్యక్రమంగానే సాగింది.అయితే 2015లో మలబార్ విన్యాసాల్లో శాశ్వత సభ్య దేశంగా జపాన్ వచ్చి చేరగా, తాత్కాలిక భాగస్వాములుగా ఆస్ట్రేలియా , సింగపూర్ లు పాల్గొంటున్నాయి.దీనికి ముందు 2007 సంవంత్సరంలో ఆస్ట్రేలియా ఈ వేడుకల్లో పాల్గొన్న అనంతరం, చైనా నుండి వచ్చిన ఒత్తిడితో ఆ దేశం వెనుకడుగు వేసింది.
ఓ చతుర్భుజ కూటమిగా ఏర్పడే 4 దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.కాగా చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం, తత్ఫలితంగా ఏర్పడుతున్న అనిశ్చితికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ ఏడాది విన్యాసాలు సాగుతున్నాయి.2019లో ఈ విన్యాసాలకు రెండు యుద్ధ నౌకలను పంపిన భారత్, ఈ దఫా మరిన్ని విమాన వాహక, యుద్ధనౌకలను పంపింది. అమెరికా నుండి ఇప్పటికే నిమిజ్, రోనాల్డ్ రీగన్, జాన్ ఎస్ మెక్ కెయిన్ (గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్) తదితర వార్ షిప్ లు చేరుకున్నాయి.జపాన్ నుండి హెలికాప్టర్ వాహక నౌక ఇజుమో, ఒనామీ (డిస్ట్రాయర్) రాగా, ఆస్ట్రేలియా తన ప్రతిష్ఠాత్మక హర్ మెజిస్టీస్ ఆస్ట్రేలియన్ షిప్ (లాంగ్ రేంజ్ ఫ్రిగేట్స్), ఇంటిగ్రల్ ఎంహెచ్ 60 హెలికాప్టర్ యుద్ధనౌకను పంపనుంది. ఈ నెలలో రెండు దశలుగా విన్యాసాలు సాగనున్నాయి. ఇండియన్ నేవీతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ, జపాన్ మెరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీల ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు ఈనెల 6వ తేదీ వరకూ జరుగనున్నాయి.