కరోనా విపత్తు సమయంలో కష్టాల్లో ఉన్న సామాన్యులకు తానున్నానంటూ అండగా నిలిచిన ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు.ఇటీవల ఉత్తరాఖండ్లో సంభవించిన జలప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన ఓ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచారు.ఈ ప్రమాదంలో తండ్రిని కోల్పోయి కష్టాల్లో ఉన్న 4 ఆడపిల్లలకు తాను అండగా ఉంటానంటూ సోను సూద్ వెల్లడించారు.
అయితే బాధిత కుటుంబాన్ని తాను దత్తత తీసుకుంటానని తెలిపారు.అలాగే ఆడ బిడ్డల చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్లోని చమోలిలో హిమానీనదం పేలడంతో సంభవించిన జలప్రళయంలో ఎలక్ట్రీషియన్ ఆలం సింగ్ ప్రాణాలు కోల్పోయాడు.అయితే కుటుంబానికి పెద్ద దిక్కు అయిన ఆలం సింగ్ వరదల్లో చనిపోవడంతో అతని భార్య, నలుగురు ఆడపిల్లలు దిక్కులేని వారయ్యారు. నలుగురు ఆడ పిల్లలు కూడా 14 ఏళ్లు, 11 ఏళ్లు, ఎనిమిదేళ్లు, రెండేళ్లు కలిగిన చిన్నపిల్లలు మాత్రమే. తండ్రి మృతితో వారి చదువులకు ఆటంకం ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే సోనూసూద్ బాధిత కుటుంబ వద్దకు తన బృందాన్ని పంపించారు. బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటానని సందేశం పంపారు.బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని, ఆడబిడ్డలు చదువుకోవటానికి, వారి పెళ్లి చేయడానికి సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు సోనూసూద్. ‘ప్రకృతి వైపరీత్యాల కారణంగా బాధపడుతున్న కుటుంబాలకు మద్ధతు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అని సోనూసూద్ అన్నారు.