ఆస్ట్రియా రాజధాని వియన్నాలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.ఇద్దరు ఉగ్రవాదులు నగరంలోని 6 ప్రదేశాల్లో ఆటోమేటిక్ ఆయుధాలతో విచ్చలవిడిగా కాల్పులు జరిపారు.అయితే ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 15 మంది వరకు గాయపడ్డారు.వారిలో ఏడుగురికి తీవ్రగాయాలైనట్టు వియన్నా మేయర్ మైఖేల్ లుడ్విగ్ వెల్లడించారు.
అయితే ఒక పోలీసు అధికారి కూడా ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తోంది.కాగా కాల్పులు జరిపిన సాయుధుల్లో ఒకరిని పోలీసులు మట్టుబెట్టారు. మృతుడు భారీగా ఆయుధాలు కలిగివున్న నేపథ్యంలో అతడి నివాసంలోకి ప్రవేశించేందుకు పోలీసులు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. మరో సాయుధుడి కోసం తీవ్ర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా ఈ దుండగుల్లో ఒకడిని ఐసిస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిగా అధికారులు గుర్తించారు.ఈ మేరకు ఆస్ట్రియా హోం మంత్రి కార్ల్ నెహామర్ నిర్ధారించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రియాలో మరోసారి లాక్ డౌన్ విధించారు.మరికొన్ని గంటల్లో లాక్ డౌన్ అమల్లోకి వస్తుండడంతో ప్రజలందరూ బార్లలోనూ, రెస్టారెంట్లలోనూ ఆస్వాదిస్తుండగా ఈ కాల్పులు ఘటన జరిగింది.