తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులను పరామర్శిస్తున్నారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ఈరోజు భారీవర్షాల వల్ల కొల్లేరు సరస్సు ముంపుకు గురైన శృంగవరప్పాడు బాధితులను కలుసుకున్నారు .గ్రామం అంతటా మోకాలి లోతు నీళ్ళు. నిత్యావసర సరుకులు కూడా అందని పరిస్థితి… ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యమా? అని నిలదీశారు.
కాగా గ్రామస్తులకు ప్రభుత్వ సాయం అందించడం సంగతి అటుంచి.. కనీసం నాయకులు, అధికారులు వచ్చి ఇంతవరకు పలకరించిన పాపాన పోలేదని లోకేష్ మండిపడ్డారు.అదే విధంగా గ్రామానికి వైద్య సదుపాయాలు లేక విష జ్వరాలు సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదనతో గ్రామస్తులు చెబుతుంటే కళ్ళు చెమర్చాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
నారా లోకేష్కు తృటిలో తప్పిన ప్రమాదం:-
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. అయితే ఆ ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే లోకేష్ పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన ట్రాక్టర్ను అదుపు చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం లోకేష్ను ట్రాక్టర్ నుంచి దింపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో లోకేష్ వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. లోకేష్ కు ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. కొద్ది సేపటి తర్వాత లోకేష్ తన పర్యటనను తిరిగి ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆయన పరామర్శిస్తున్నారు.